అమరావతి : రాష్ట్రంలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై చర్చించింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైనవారికి రూ.50వేలు, మెయిన్స్లో ఉత్తీర్ణులైతే రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కర్నూలులో నేషనల్ లా వర్సిటీకి మరో 100 ఎకరాల భూ కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానం, కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.రాష్ట్రంలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. పోలవరం నిర్వాసితుల ఇండ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్కు స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల మినహాయింపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్పై రాయితీ వచ్చేందుకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.