ఆగస్టు 10లోపు గృహలక్ష్మి కింద లబ్ది కోసం దరఖాస్తు చేసుకోవాలి

– బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండుగల మల్లయ్య
నవతెలంగాణ -తాడ్వాయి 
ఆగస్టు 10 లోపు గృహలక్ష్మి కింద లబ్ధి కోసం దరఖాస్తు చేసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండోరా మల్లయ్య తెలిపారు. శనివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. గృహలక్ష్మి పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, మండలంలోని లబ్ధిదారులందరూ గృహలక్ష్మి పథకం లబ్ధి కోసం అవసరమైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 10 తారీఖు లోగా మండల కార్యాలయాల్లో, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక గృహలక్ష్మి కౌంటర్లలో సమర్పించాలని ఆయన తెలిపారు. ఆగస్టు 10వ తారీఖు వరకు వచ్చిన దరఖాస్తుల జాబితా రూపొందించి ఉన్నత అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపడతారని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆహార భద్రత కార్డు ఉన్నవారికి, సొంత ఇండ్లు లేని వారికి, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 59 కింద లబ్ది పొందని వారిని అర్హులుగా ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ఆగస్టు 20వ తారీకు వరకు క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి, ఆగస్టు 25 నాటికి గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. గృహలక్ష్మి కింద లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనల మేరకు పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, గృహలక్ష్మి ఇండ్ల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే సమీప ప్రభుత్వ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, ప్రతి మండల తహసిల్దార్ కార్యాలయంలో, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఆగస్టు 10లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు సమర్పించాలని సూచించారు.