మెట్రో రైల్‌ విస్తరణను ఆమోదించండి

– పట్టణ ఉపాధి హామీ అమలు చేయాలి
– కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీకి కేటీఆర్‌ వినతి
న్యూఢిల్లీ : హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని రాష్ట్ర మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు కోరారు. ఈ మేరకు శనివారం నాడిక్కడ అక్బర్‌ రోడ్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీని ఆయన నివాసంలో కలిసి వివిధ అంశాలపై వినతి పత్రం అందజేశారు. లక్టీకపూల్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ఐదు కిలోమీటర్ల మెట్రోకు ఆమోదంతో పాటు, ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరి పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురావాలన్న ప్రతిపాదనను సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ నగర పరిధిలో చేపట్టిన మిస్సింగ్‌, లింకు రోడ్‌ల కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయనీ, ఇప్పటికే 22 మిస్సింగ్‌ లింక్‌ రోడ్లను పూర్తి చేశామని, మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని కెేటీఆర్‌ తెలిపారు. అదేవిధంగా అవుటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు దాదాపు రూ.2,400 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.800 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌ నగరంలో పారిశుధ్య కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను శుద్ధి చేయడంతో పాటు చెత్తను తరలించేందుకు అవసరమైన వాహనాల ప్రొక్యూర్మెంట్‌ కోసం, ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ల నిర్మాణం వంటి వివిధ కార్యక్రమాల కోసం స్వచ్ఛ భారత్‌ మిషన్‌, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద రూ.400 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. రూ.3,050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి 15 శాతం నిధులను కేంద్రం అందించాలని, ఇందుకోసం రూ.450 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ నగర పరిధిలో చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణ ఖర్చు దాదాపు రూ.3,722 కోట్లు అవుతుందనీ, ఇందులో కనీసం 20 శాతం రూ.744 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందించాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్రం నిర్దేశించిన సిటిజన్‌ సెంట్రిక్‌ రిఫార్మ్స్‌ కింద బయో మైనింగ్‌, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటువంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, వీటన్నింటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో చేపడుతున్న కార్యక్రమాలకు మొత్తంగా రూ. 3,777 కోట్లు ఖర్చు అవుతు ందని, ఇందులో రూ.750 కోట్లు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్‌ హబ్‌ వల్ల పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందన్నారు. ఈ అంశంపైన తెలంగాణ తన నమూనాను, ఆలోచనలను పంచుకోవాలని కేటీఆర్‌ను హర్దీప్‌ సింగ్‌ పూరి కోరారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటుచేసే సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజెంటేషన్‌ ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, ఎస్‌ఆర్డీపి, లింకు రోడ్లు, పారిశుద్ధ్యరంగంలో చేపట్టిన సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్‌ రావాలని కేంద్ర మంత్రిని కెటి రామారావు ఆహ్వానించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కేటీఆర్‌ వెంట బీఆర్‌ఎస్‌ ఎంపీలు జి.రంజిత్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఉన్నారు.
ధాన్యంపై పియూష్‌ గోయల్‌కు వినతి
తెలంగాణ రాష్ట్రంలో 2022-23 యాసంగి పంటకు గాను 20 లక్షల మెట్రిక్‌ టన్నుల అదనపు పారా, బాయిల్డ్‌ రైస్‌ సేకరణకు కేంద్ర మంత్రి పియూష్‌ గోయాలకు విన్నవించడం జరిగిందని మంత్రి కెటి రామారావు తెలిపారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు గురించి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ యాసంగి సీజన్‌లో 57 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగిందని, ఇది దేశంలో 50శాతం కంటే ఎక్కువ అని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. ప్రధానంగా యాసంగి పంట 88.11 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిని సేకరించిడం జరిగిందన్నారు. ఇందులో భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 10.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉడకబెట్టిన బియ్యాన్ని తీసుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నదని. దీనివల్ల ఒక లక్ష మెట్రిక్‌ టన్నులు సేకరించేందుకు 42.08 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని తెలిపారు.