రామాలయ నిర్మాణంతో సమస్యలన్నీ పోయాయా?

రామాలయ నిర్మాణంతో సమస్యలన్నీ పోయాయా?– మార్కెట్‌ చేసుకుని మోడీ లీడరయ్యారు
– రాహుల్‌గాంధీ ఓ ఫైటర్‌ :విలేకర్ల ఇష్టాగోష్టిలో జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అయోధ్య రామాలయ నిర్మాణంతో దేశంలోని సమస్యలన్నీ పోయాయా? అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి బీజేపీ నేతలను ప్రశ్నించారు. గుళ్లు కడితే ఉద్యోగాలు వస్తాయా?అని నిలదీశారు. సోషల్‌ మీడియాను మార్కెటింగ్‌ చేసుకుని మోడీ లీడర య్యారని ఎద్దేవా చేశారు. మోడీ ఎక్కడా పోరాటం చేయలేదనీ, ఆయన సీల్డ్‌ కవర్‌లో గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శిం చారు. రాహుల్‌గాంధీ ఫైటర్‌ అనీ, ఆయనకు మోడీకి పోలికే లేదన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జగ్గారెడ్డి విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాముడి ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్‌ గాంధీ మాత్రమేనని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. పేదల కోసం రాముడు పాలన చేశారని గుర్తు చేశారు. అయోధ్య గుడి నిర్మిస్తే తాను సంతోషిస్తానంటూ రాముడు అన్నారా? అని బీజేపీ నేత లను ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, బండి సంజరులు రాజకీయంగా బతకాలంటే, జై శ్రీరామ్‌ అనకతప్పదని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ చరిత్ర తెలియని బీజేపీ నేతలు ఆయన రాజకీయ జీవితం మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలు రాహుల్‌ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చుట్టే తిరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ సీని యర్‌ నేత ఎల్‌కే అద్వానీ రథయాత్రకు ముందు దేశానికి, గుజరా త్‌కు మోడీ ఎవరో కూడా తెలియదన్నారు. ఆ యాత్ర పూర్తి అయ్యాక.. గుజరాత్‌ ఎన్నికల్లో మోడీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అద్వానీ సీల్డ్‌ కవర్‌లో ఆయన్ను సీఎంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇది నిజం కాదని బీజేపీ నేతలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ కూడా చాలా రాష్ట్రాల సీఎంలను సీల్డ్‌ కవర్‌లో డిసైడ్‌ చేశార న్నారు. కానీ సీఎంలను డిసైడ్‌ చేసే రాహుల్‌ గాంధీకి, సీల్డ్‌ కవర్‌ సీఎం మోడీకి చాలా తేడా ఉందని చెప్పారు. మోడీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన అధికారం కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కానీ ప్రజల నుంచి వచ్చిన లీడర్‌ రాహుల్‌ గాంధీ అని ఈ సందర్భంగా జగ్గారెడ్డి వివరించారు.