ఒకేషనల్‌ ఇంగ్లీష్‌ అధ్యాపకులు మూల్యాంకనానికి పనికిరారా?

– వెంటనే నియామక ఉత్తర్వులివ్వాలి
– తెలంగాణ ఒకేషనల్‌ అధ్యాపకుల సంఘం డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ ఇంగ్లీష్‌ అధ్యాపకులు జవాబు పత్రాల మూల్యాంకనానికి పనికిరారా?అని తెలంగాణ ఒకేషనల్‌ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు ఒకేషనల్‌ ఇంగ్లీష్‌ అధ్యాపకులకు వెంటనే నియామక ఉత్తర్వులను ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పీటర్‌ మహేష్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకేషనల్‌ ఇంగ్లీష్‌ అధ్యాపకుల పట్ల వివక్ష చూపడం సరైంది కాదని తెలిపారు. శనివారం నుంచి మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమవుతుందనీ, వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరా బాద్‌లోని నాంపల్లిలో ఒకేషనల్‌ ఇంగ్లీష్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. జనరల్‌ అధ్యాపకులు మూల్యాంకనం చేస్తే విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటర్‌ బోర్డు అధికారులు స్పందించి వెంటనే ఒకేషనల్‌ ఇంగ్లీష్‌ అధ్యాపకులకు ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు.