అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు

– నియోజకవర్గానికి 14 టేబుల్ లో ఏర్పాటు
 – ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
 నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్గొండ జిల్లాలో  రేపు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అర్వి.కర్ణన్ తెలిపారు. తిప్పర్తి మండలం అనిశెట్టి ధుప్పల పల్లి లోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం లో డిసెంబర్ 3 ఉదయం 8 గంటలకు నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, మును గోడ్, నకిరేకల్, నాగార్జున సాగర్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్ట నున్నట్లు వివరించారు.
లెక్కింపునకు ఏర్పాట్లు….
3న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం  ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.తిప్పర్తి మండలం అనిశెట్టి ధుప్పల పల్లి లోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం లో  లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, మును గోడ్, నకిరేకల్, నాగార్జున సాగర్ నియోజకవర్గాలకు  అసెంబ్లీనియోజక వర్గాలకు వేరు వేరు కౌంటింగ్‌ హాల్ లను ఏర్పాటు చేశారు.  ఒక్కో నియోజకవర్గంలో ఈవీఎం ల ఓట్ల లెక్కింపుకు 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. లెక్కింపులో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లెక్కించనున్నారు.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు ప్రతి నియోజకవర్గానికి అదనంగా టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది.ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారు.
స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రత..
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్ లోకి అనుమతి ఇస్తున్నారు. స్ట్రాంగ్ రూం ల వద్ద 24 గంటల పటిష్ట  నిఘా, భద్రతను ఏర్పాటు చేశారు.