
– సమాచారం ఇచ్చిన ప్రిన్సిపాల్ లో గైర్హాజరు: రిజిస్ట్రార్ ఎం యాదగిరి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిగ్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి అన్నారు. శుక్రవారం యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన వివిధ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లతో అకడెమిక్ ఆడిట్ సెల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయా కళాశాల పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ గా వ్యవహరించే వారు పేపర్ డౌన్ లోడ్ చేసే సమయానికి విధిగా పరీక్ష కేంద్రంలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ లకు అనివార్యమైన, అత్యవసర పనుల ఏమైనా ఉంటే విధిగా అక్కడ పనిచేస్తున్న మరో అధికారికి లిఖిత పూర్వకంగా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఇదే విషయాన్ని వర్సిటీ ఆడిట్ సెల్ లేదా పరీక్షల విభాగం అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈనెల 21 నుండి జూన్ 15 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 38 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించ నున్నట్టు తెలిపారు. 2, 4, 6 సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు దాదాపు 24 వేల మంది , 1, 3, 5 బ్యాక్లక్ పరీక్షల కు 14 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఎలాంటి లొసుగులు లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్ష పత్రం డౌన్ లోడ్ చేసే సమయంలో యూనివర్సిటీ నియమించిన అబ్జర్వర్స్ తో పాటు ప్రిన్సిపల్ లేదా చీఫ్ సూపరింటెండెంట్ తప్పనిసరి గా ఉండాలని చెప్పారు. ఈసారి పరీక్షల కు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇన్విజిలేటర్ సెల్ ఫోన్ లు వినియోగించ కూడదని ఆదేశాలను జారీ చేశారు. ఈ సమావేశం పై ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కొంతమంది ప్రిన్సిపళ్లు మరీ ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజర్ అవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఆయన ఆయా ప్రిన్సిపల్ ల నుండి వివరణ కోరాలని ఆడిట్ సెల్ అధికారులకు ఆదేశించారు.ఈ సమావేశంలో పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, అకడెమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చంద్ర శేఖర్,జాయింట్ డైరెక్టర్ అతీక్ సుల్తాన్ ఘోరీ పాల్గొన్నారు.