నవతెలంగాణ – కామారెడ్డి
మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో జరిగే ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లపై సమక్ష నిర్వహించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులకు తెలిపారు. వైద్య ,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పారు. డి ఆర్డిఓ, మెప్మా ఆధ్వర్యంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు మహిళలు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, మహిళలు, ప్రజలు కూర్చోవడానికి సరిపడా ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, సిపిఓ రాజారామ్, డి ఆర్డిఓ సురేందర్, జిల్లా వయో వృద్దుల, శిశు సంక్షేమ అధికారి బావయ్య, ట్రాన్స్కో ఎస్ఈ రమేష్ బాబు, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.