– కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ గారితో ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ తేదీ: 2.01.2025 రోజున ఉదయం 11.00 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్), నిజామాబాద్ నందు ఉపవర్గీకరణ, వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేయుచున్నదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డిలతో కూడిన ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై ఏక సభ్య కమిషన్ కు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ఎస్సీ కులానికి చెందిన ప్రజాప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, షెడ్యూల్డు కుల సంఘాల నాయకులు, ఇతర ఉద్యోగులు, ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన అన్ని వర్గాల వారు హాజరై ఏకసభ్య కమిషన్ కు తమ తమ వినతులు అందజేయాలని కలెక్టర్ కోరారు. కమిషన్ కు నిర్ణీత నమూనాలో సమర్పించాల్సిన దరఖాస్తు ఫారములు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ సహాయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయాలలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.