18న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక

– ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్‌, డీజీపీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నారు. ఐదు రోజుల పాటు ఆమె ఇక్కడ బస చేయనున్నారు. ఆమె ఈ నెల 23న తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపె సీఎస్‌ శాంతికుమారి వివిధ శాఖల అధికారులతో బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ భద్రత, ట్రాఫిక్‌ ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఆరోగ్య, రోడ్లు భవనాలు, మున్సిపల్‌, విద్యుత్‌, సంబంధిత శాఖలు బ్లూ బుక్‌ ప్రకారం ఫూల్‌ప్రూఫ్‌ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ రవి గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునిల్‌ శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సీనియర్‌ పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.