కెప్టెన్‌గా అసలంక

Asalanka as captain– భారత్‌తో టీ20 సిరీస్‌కు శ్రీలంక జట్టు
పల్లెకెలె: ఇండియాతో ఈ నెల 27 నుంచి జరిగే మూడు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టుకు చరిత్‌ అసలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు 16 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. టీ20 వరల్డ్‌ కప్‌లో నిరాశ తర్వాత స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వానిందు హసరంగ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అసలంకకు పగ్గాలు దక్కాయి. 29 ఏండ్ల అసలంకకు ఇది వరకు కెప్టెన్సీ అనుభవం ఉంది. ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌ టూర్‌లో రెండు టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా, ఇండియాతో సిరీస్‌కు శ్రీలంక జట్టులో సెలెక్టర్లు భారీ మార్పులు చేశారు. సీనియర్‌ ఆల్‌రౌండర్లు ఏంజెలో మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వ, కీపర్‌ సదీర్‌ సమరవిక్రమ, పేసర్‌ దిల్షన్‌ మదుషంకను పక్కనబెట్టారు. 34 ఏండ్ల దినేశ్‌ చండిమల్‌ను రెండేండ్ల తర్వాత తిరిగి టీ20 టీమ్‌లోకి తీసుకున్నారు. కాగా, ఈ సిరీస్‌లో మ్యాచ్‌లు ఈ నెల 27, 28, 30వ తేదీల్లో జరగుతాయి. శ్రీలంక జట్టు: చరిత్‌ అసలంక (కెప్టెన్‌), పాతుమ్‌ నిశాంక, కుశాల్‌ పెరీరా (కీపర్‌), అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌ (కీపర్‌), దినేష్‌ చండిమల్‌, కమిందు మెండిస్‌, దాసున్‌ షనక, వానిందు హసరంగ, దునిత్‌ వెల్లలగే, మహేశ్‌ తీక్షణ, చమిందు విక్రమసింగే, మతీష పతిరణ, నువాన్‌ తుషార, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో.