– అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జారే..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రగతి కోసం సైన్స్ ఆశయంతో జన విజ్ఞాన వేదిక తెలంగాణ విభాగం నిర్వహించే సైన్స్ సంబురాలలో చెకుముకి ప్రతిభా పరీక్షలో అశ్వారావుపేట జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కు చెందిన ముగ్గురు విద్యార్ధులు రాష్ట్ర స్థాయిలో తమ సత్తా చాటి అశ్వారావుపేట ఖ్యాతిని తెలంగాణ వ్యాప్తం చేసారు. ఇది తెలిసిన స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం పాఠశాలను సందర్శించి విజేతలు అయిన ముగ్గురు విద్యార్ధిని లను అభినందించారు. చెకుముకి మండల స్థాయి పరీక్షలు జనవరి 27 నిర్వహించారు. పలు పాఠశాలల నుండి అనేక మంది పాల్గొన్న పరీక్షల్లో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి చదివే ఓ.సంగీత, కే.శ్రావణి, ఎన్.యామినిలు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపిక అయ్యారు.జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెంలో ఫిబ్రవరి 3న జరిగిన జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి కి ఎంపిక అయ్యారు. ఈ నెల 9,10,11న జిల్లా కేంద్రం అయిన జనగాం ఏకశిలా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ సంబురాలలో పాల్గొనేందుకు ఉపాద్యాయులు జయశ్రీ,సుజాతల పర్యవేక్షణలో ఈ ముగ్గురు విద్యార్ధులు వెళ్ళారు. అక్కడ సైతం ప్రతిభ కనబరిచి కన్సోలేషన్ బహుమతిగా ముగ్గురికి రూ.2700 నగదు, ప్రశంసా పత్రాలు అందజేసారు. దీంతో వీరికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తోపాటు ప్రధానోపాధ్యాయులు వెంకయ్య, పాఠశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.