టెండర్‌ వాపస్‌ తీసుకోవాలంటూ కాంట్రాక్టర్‌ ఇంటిపై దాడి

– గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఘటన – వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు
నవతెలంగాణ-గోదావరిఖని:
ఒక టెండర్‌ విషయంలో రింగుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు బరి తెగించి, తోటి కాంట్రాక్టర్ల ఇంటిపై శనివారం దాడికి పాల్పడ్డారు. తమతో కలవకుండా ఆన్లైన్‌లో టెండర్‌ వేసిన తోటి నలుగురు సివిల్‌ కాంట్రాక్టర్లపై దౌర్జన్యంకు పాల్పడిన సంఘటన గోదావరిఖని మార్కండేయ కాలనీలో చోటు చేసుకుంది. బాధిత కాంట్రాక్టర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణి ఆర్జీ 1 పరిధిలో సింగరేణి ప్రైమరీ పాఠశాల మరమ్మతు పనులకు సంబంధించి యాజమాన్యం సివిల్‌ కాంట్రాక్టర్ల వద్ద నుంచి ఆన్‌ లైన్‌ ద్వారా టెండర్లు పిలిచింది. అయితే ఈ పనులను దక్కించుకునేందుకు సింగరేణి సివిల్‌ కాంట్రాక్టర్లు ఒక రింగుగా ఏర్పడ్డారు. అయితే వీరిలో నలుగురు కాంట్రాక్టర్లు వీరగంటి నరేందర్‌, సిహెచ్‌.విజయ్‌ కుమార్‌, మారం సమ్మయ్య, నరేష్‌లు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా సివిల్‌ కాంట్రాక్టర్లు ఒకటై అ టెండర్‌ను వాపస్‌ తీసుకోవాలంటూ కొద్దిరోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా వారు ఆరోపించారు. శనివారం నాడు 40 మంది సివిల్‌ కాంట్రాక్టర్లు కలిసి టెండర్‌ విషయంలో మాట్లాడుదామని ఫోన్లో సంప్రదించారని, తాము స్థానికంగా లేమని నరేందర్‌ అనే కాంట్రాక్టర్‌ చెప్పినప్పటికీ వినకుండా మార్కండేయ కాలనీలోని అతని ఇంటి మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ కుటుంబ సభ్యులు హుటాహుటిన గోదావరిఖని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశారు. ఎస్సై సుగుణాకర్‌ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సింగరేణి సివిల్‌ టెండర్ల విషయంలో కాంట్రాక్టర్లు భౌతిక దాడులకు పాల్పడేందుకు తెగించిన సంఘటన ఇక్కడ కలకలం సష్టిస్తుంది. దాడికి పాల్పడేందుకు ఒడిగట్టిన సివిల్‌ కాంట్రాక్టర్లపై యాజమాన్యం చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.