లైంగికదాడికి యత్నించిన వ్యక్తిని ..

ఇనుపరాడితో కొట్టి చంపిన మహిళ
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
ఇంట్లోకి వెళ్లి మహిళపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తిని మహిళ రాడ్డుతో కొట్టి చంపింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికులు, సీఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్వేల్‌ ప్రాంతానికి చెందిన జయమ్మ రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో నిద్ర లేచి ఇంటి తలుపులు తీసింది. అదే సమయంలో పక్క ఇంట్లో ఉండే వ్యక్తి శ్రీనివాస్‌(45) ఆమె ఇంట్లోకి ప్రవేశించి జయమ్మపై లైంగికదాడికి ప్రయత్నించారు. వెంటనే ఆమె బయటకు వచ్చి పక్కనే ఉన్న రాడుతో శ్రీనివాస్‌ తలపై బలంగా కొట్టింది. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీనివాస్‌ ఆ సమయంలో బాగా మద్యం తాగి ఉన్నాడు. వెంటనే జయమ్మ రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయింది. తనపై లైంగికదాడికి ప్రయత్నించినందుకు రాడుతో కొట్టానని ఆమె పోలీసులకు తెలి పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.