
నవతెలంగాణ-పెన్ పహాడ్
నిరుపేద కుటుంబంలో పుట్టి ఇంటర్ ఫేయిల్ అయ్యి ఆటో డ్రైవర్ గా జీవితం కొనసాగించిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా పొందే స్థాయికి ఎదిగారు. మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 83వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టా పొందారు. తెలుగులో ముస్లిం సాహిత్యం, ముస్లింవాద సాహిత్యం సమగ్ర అధ్యయనం అనే అంశంపై ప్రొ. ఎన్ఆర్ వెంకటేశం పర్యవేక్షణలో సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ లభించినట్లు, ఈ పట్టాను షేక్ హుస్సేన్ రాష్ట్ర గవర్నర్ ఓయూ విశ్వవిద్యాలయ చాన్సులర్ తమిళిసై సౌందర్య రాజన్ అధ్యక్షత ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్, అమెరికాకు చెందిన అడోబ్ కంపెనీ సిఈఓ పద్మశ్రీ డా. శంతను నారాయణన్ ల చేతుల మీదుగా అందుకున్నారు. మండలంలో తొలిసారిగా తెలుగులో డాక్టరేట్ సాధించిన వ్యక్తిగా షేక్ హుస్సేన్ నిలిచారు. ఇదే మండలం నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి ముస్లింగా కూడా నిలిచారు. చిన్న, సన్నకారు రైతుకుటుంబంలో జన్మించిన హుస్సేన్ తల్లిదండ్రులు షేక్ జాన్ సాబ్(లేట్) అసన్ భీల ప్రోత్సాహంతో వ్యవసాయం నుంచి విద్యకు మళ్లారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన షేక్ హుస్సేన్ విద్య పట్ల తనకు ఉన్న ఆసక్తితో ఎంఎ, ఎల్ఎల్బి చేసి హైకోర్ట్ న్యాయవాదిగా ఎదిగారు. అదే క్రమంలో సాహిత్యంపై మక్కువతో తెలుగులో పరిశోధనకు ఉపక్రమించి, పట్టుదలతో చక్కనైన సిద్ధాంతగ్రంథాన్ని రూపొందించి ఉస్మానియా విశ్వ విద్యాలయానికి సమర్పించారు. విద్యార్థి జెఎసి నాయకునిగా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎంతోమంది యువకులకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ వారి విద్యాప్రగతికి తోడ్పడుతున్నారు. డాక్టరేట్ సాధించిన షేక్ హుస్సేన్ ను అభినందిస్తూ హుస్సేన్ కృషి ఎందరికో స్ఫూర్తినిస్తుందని అనంతారం గ్రామస్థులు, పెద్దలు,యువకులు, విద్యావంతులు అభినందించారు.