– కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్
నవతెలంగాణ బ్యూరో, హైదరాబాద్
కరెంటు సరఫరాపై కట్టుకథలు చెప్పడం మానేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సూచించారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు ప్రధాని మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నదంటూ కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో చేసిన పోస్టుపై కవిత స్పందించారు. తెలంగాణ విద్యుత్తు పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతుందన్నారు. తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్లో పెద్దపల్లి ఎన్టీపీసీ ద్వారా వస్తున్నది కేవలం నాలుగు శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్ను అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయడం మానుకోవాలని అన్నారు.