ప్రజల కోసమే బాబు జగ్జీవన్‌ రామ్‌ జీవితం అంకితం : కాసాని జ్ఞానేశ్వర్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌
ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ ఆయన సేవలు చిరస్మరణీయమని తెలుగుదేశం తెలంగాణశాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో బాబు జగ్జీవన్‌ రామ్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన మార్గం ఆచరణీయమని గుర్తు చేశారు. జాతీయ నాయకుడుగా, పార్లమెంట్‌ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా అణగారిన తరగతుల అభ్యున్నతికి ఆయన రాజకీయ జీవితంలో ఎనలేని సేవలు అందించారని అభిప్రాయపడ్డారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు ప్రేమ్‌ కుమార్‌ జైన్‌, టి.జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శులు రాజు నాయక్‌, జక్కిలి ఐలయ్య, ఎస్సీ సెల్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌, అధికార ప్రతినిధులు సూర్యదేవర లత, దామర సత్యం, ముప్పిడి గోపాల్‌, కార్యనిర్వాహక కార్యదర్శి సంధ్య పోగు రాజశేఖర్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.