బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి యువతకు ఆదర్శం

నవతెలంగాణ – తుంగతుర్తి
స్వాతంత్ర్య సమరయోధుడు,సంఘసంస్కర్త,రాజకీయవేత్త అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆదర్శమూర్తి బాబు జగ్జీవన్ రామ్ అని భువనగిరి పార్లమెంట్ యువజన కాంగ్రెస్ నాయకులు పెద్దబోయిన అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి,కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భారత పార్లమెంటులో 40 సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా,ఉప ప్రధానిగా వారు చేసిన సేవలు మరువలేనివి అన్నారు.సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్,భారత ప్రజానీకం గుండెల్లో సజీవంగా ఉన్న దార్శనికుడు విద్యావేత్త అన్నారు. కులరహిత సమాజం కోసం జీవితాంతం పోరాడారని,అణగారిన వర్గాల అభ్యున్నతికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మలుచుకున్న ప్రజా నాయకుడు జగ్జీవన్ రామ్ అన్నారు. సామాజిక స్పృహతోనే సామాన్యుడు అసామాన్యుడుగా ఉద్భవిస్తాడని,అనుకున్నది సాధించుకునే వ్యక్తి మన బాబు జగ్జీవన్ రామ్,వారి జీవిత చరిత్ర భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ కొండ రాజు ,జిల్లా కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ ,కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి పట్టణ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు,మాచర్ల అనిల్, ముత్యాల వెంకన్న,పరుశురాం, హసేన్,సంజీవ,నాగేశ్వరరావు,యాకూబ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.