11 నుండి 13 వరకు బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం

– కలెక్టర్ హరిచందన  దాసరి
నవతెలంగాణ నల్లగొండ కలెక్టరేట్ 
ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు  రాజకీయ పరమైన బల్క్ ఎస్ఎంఎస్ ల పై  నిషేధం ఉంటుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన గురువారం  ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుండి పోటీలో ఉన్న అభ్యర్థులు గాని,రాజకీయ పార్టీలు గానీ ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వకూడదని, ఒకవేళ ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బల్క్ ఎస్ఎంఎస్  లు పంపించినట్లయితే చట్ట రీత్యా ఎన్నికల నిబంధనల మేరకు తగు చర్య తీసుకోబడుతుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆయా రాజకీయ పార్టీలు, అలాగే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు సైతం దృష్టిలో ఉంచుకొని 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వవద్దని స్పష్టం చేశారు.