నేడు బండ మల్లన్న జాతర

– ఏండ్ల చరిత్ర కలిగిన మల్లన దేవాలయం
– ముస్తాబైన బండ మల్లన్న జాతర ఏర్పాట్లు
నవతెలంగాణ-మిరుదొడ్డి
మల్లన్న బండ మనకు అండ. కొలిసిన వారికి కొంగుబంగారం సిద్దిపేట జిల్లా అక్బర్‌ పేట భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి జంగాపల్లి ఇరు గ్రామాల పొలిమేరలలో ఉన్న మల్లన్న బండపై ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ పర్వదినాన వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన బండ మల్లన్న జాతర జరుగుతుంది. దాదాపు 120 ఎకరాల విస్తీర్ణం కలిగి 60 గజాల ఎత్తు కలిగి ఉన్న బండపై పరమేశ్వరుడు మల్లన్న దేవుడిగా అవతరించి ఇక్కడే ప్రజల పాలిట కొంగుబంగారంగా అవతరించారని ప్రజల విశ్వాసం. విశాలమైన ఈ బండపై రాజరాజేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వర ఆలయం పాండవుల విగ్రహాలు, హనుమాన్‌ దేవాలయం,నాగదేవత ఆలయం, పోచమ్మ దేవాలయం తో పాటు పుట్టుగుండం మల్లన్న పాదముద్రలతో పాటు ఎన్నో దేవత విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో బండపై బోనాల ప్రారంభంతో సంక్రాంతి సంబరాలు ఆయా గ్రామాల్లో ప్రారంభమై సంక్రాంతి వరకు కొనసాగుతుంది. బండ చుట్టూ ఉన్న గ్రామాలు వీరారెడ్డిపల్లి, జంగాపల్లి, గాజులపల్లి, అల్మాజిపూర్‌, గ్రామాలకు చెందిన ఎడ్లబండ్లు బండపై కొలువుదీరిన మల్లన్న దేవాలయం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. బండపై శాససిద్ధంగా వెలసిన పుట్టుగుండంలో దశాబ్దాలుగా గడుస్తున్న బావిలో నీరు ఎన్ని కరువు కాటకాలు ఎదురైనా నేటికీ నీరు పుష్కలంగా ఉండడం మల్లన్న దేవుడి మహిమగా భక్తులు కొనియాడుతున్నారు. పుట్టుగుండంలోని నీరు రైతులు తమ తమ పొలాల్లో చల్లినట్లయితే పంటలు విరివిగా పండుతాయి అని రైతులు గొప్పలుగా చెప్పుకుంటారు. బండ మల్లన్న జాతర అనంతరం రెండు రోజులపాటు వీరారెడ్డిపల్లి జంగాపల్లి జాతరలు జరుపుకోవడం ఈ రెండు గ్రామాల్లో ఆనవాయితిగా వస్తుంది. మల్లికార్జున దేవాలయం సహజసిద్ధంగా వెలిసిన సొరికే లాంటి బండలో వెలిసిన కారణంగా బండ మల్లన్నగా పేరు ప్రఖ్యాతలుగా ప్రసిద్ధి చెందింది. ఈ జాతరకు వరంగల్‌, కరీంనగర్‌ హైదరాబాద్‌ రంగారెడ్డి నిజామాబాద్‌ వంటి జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా బండ మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. పరమశివుని ఆజ్ఞ లేకుండా పార్వతి తన తండ్రి అయిన దక్షరాజు వద్దకు వెళ్లిందన్న కోపంతో దక్షరాజు పైకి దండెత్తి తిరుగు ప్రయాణంలో అలసిపోయి ఈ బండపై సేద తీరుతుండగా చెమటతో నిండిన దేహాన్ని తడుముతూ చేతికి వచ్చిన చెమటను తీసి విసరడంతో సరికలో ఉన్న మట్టి బెడ్డలపై పడడంతో ఓ పసివాడు ఉద్భవించాడని శివుని మారు చెమటతో బండపై వెలసినందున బండ మల్లన్నగా పిలవబడి ఇక్కడి భక్తులు కొలిచే దైవంగా వెలిసి భక్తుల పాలిట కొంగుబంగారమై వర్ధిల్లుమని అంతర్దాన మయ్యాడని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. దీనికి నిదర్శనంగా మల్లన్న బండపై పెట్టిన అడుగు ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది.
భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి
బండ మల్లన్న జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాటు చేసినట్లు ఆయా గ్రామాల సర్పంచులు పన్యాల వెంకటరెడ్డి కంచం యాదగిరి ఎంపీటీసీ బాల మల్లేశం గౌడ్‌ ఆలయ కమిటీ ప్రతినిధులు మరియు ఆలయ అర్చకులు, జంగం కొమురయ్య, శ్రీనివాస్‌ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కపకు పాత్రులు కావాలన్నారు. అనంతరం దుబ్బాక సీఐ మున్నూరు కష్ణ పరిశీలించారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.