బీసీ గురుకుల ఉపాధ్యాయ సమస్యలు త్వరలో పరిష్కారం

బీసీ గురుకుల ఉపాధ్యాయ సమస్యలు త్వరలో పరిష్కారం– మంత్రి పొన్నం ప్రభాకర్‌
–  పీఆర్‌జీటీఏ క్యాలెండర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీసీ గురకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రొగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ గురుకుల టీచర్స్‌ అసోసియేషన్‌ (పీఆర్‌జీటీఏ) క్యాలెండర్‌ను ఆయన బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. బీసీ గురుకులాల పనివేళలను మార్చాలనీ, 317 జీవో ద్వారా తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూటీఎస్‌ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మంత్రిని కోరారు. వచ్చే వేసవి సెలవుల్లో పదోన్నతులు కల్పించాలని సూచించారు. బీసీ గురుకుల ఉపాధ్యాయులకు టీఎస్‌జీఎల్‌ఐ అమలు చేయాలని తెలిపారు. రెండో శనివారం సెలవు ప్రకటించాలని పేర్కొన్నారు. 010 పద్దు ద్వారా వేతనాలను అందించాలని తెలిపారు. ఆయా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, పత్రిక ఎడిటర్‌ ఇన్నారెడ్డి, పీఆర్‌జీటీఏ నాయకులు దిలీప్‌రెడ్డి, ఉప్పు అశోక్‌, ఈ శ్రీనివాసాచారి, ఐ నిర్మలానందం, పి విద్యాసాగర్‌, ఎం శ్రీనివాస్‌రెడ్డి, విజయచంద్రారెడ్డి, వి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. బీసీ గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూటీఎస్‌ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు.