సైబర్‌ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి

– సైబారాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి
నవ తెలంగాణ – హైదరాబాద్‌
సైబర్‌ మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని సైబారాబాద్‌ పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి తెలిపారు. నగరంలో శనివారం ఇసాకా హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ‘సెక్యూరింగ్‌ ది ఫ్యూచర్‌: నావిగేటింగ్‌ ది ఇంటర్‌సెక్షన్‌ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ, ప్రైవసీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో అనినాష్‌ మహంతి పాల్గొని మాట్లాడారు. మనిషిలో రెండు విషయాలను ఆసరాగా చేసుకొని వీరు మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అవి.. భయం, దురాశ అన్నారు. ఈ సంవత్సరం సైబర్‌ క్రైమ్‌ మొత్తం నేరాలలో 30 శాతం ఉందని, అది రాబోయే కాలంలో 50 శాతానికి చేరవచ్చన్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, రుణ యాప్‌ ల మోసాలు విపరీతంగా పెరిగాయన్నారు. వీరు యుపిఐ చెల్లింపులు, క్రిప్టో నెట్‌వర్క్‌ ఉపయోగించి పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారని తెలిపారు.