కరెంటుతో జాగ్రత్త

– సరఫరాలో ఇబ్బందులు ఎదురవ్వొద్దు : సమీక్షా సమావేశంలో విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వర్షాకాలం ప్రారంభమవుతున్న దృష్ట్యా ప్రజలు కరెంటుతో జాగ్రత్తగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయి అప్రమత్తతో ఉండాలని ఆదేశించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో శనివారంనాడాయన విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ఈదురు గాలులతో చెట్లు విరిగిపడడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్‌ తీగలు ఊడిపడడం వంటి సంఘటనలు సాధారణంగా జరుగుతుంటాయనీ, ఇలాంటి ఘటనలపట్ల ప్రజలు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.