నవతెలంగాణ – తాడ్వాయి
ప్రతీ రెండేళ్ల కోసారి మాగశుద్ధ పౌర్ణమి రోజున గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం మేడారం జాతరఫిబ్రవరి 21న మొదలై 24న ముగియనుంది. అయితే జాతర సమయంలోనే కాకుండా భక్తులు పెద్దఎత్తున ముందస్తుగా తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
గిరిజన కుంభమేళా మేడారం: ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం అభయారణ్యంలో ప్రతీ 2 సంవత్సరాలకు ఒకసారి వనదేవతల జాతర ఘనంగా జరుగుతుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24 వరకు నాలుగు రోజులపాటు మేడారం గ్రామం మహానగరంగా గిరిజన కుంభమేళాను తలపించనుంది. నాలుగు రోజుల పాటు జరిగే వన దేవతల జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర చత్తీస్ గడ్ జార్ఖండ్ నుంచి గిరిజనులు భారీ సంఖ్యలో తరలివచ్చి వనదేవతలకు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. సుమారు కోటి మంది భక్తులు తరలిరావడంతో మేడారం జాతర ప్రాంతాలు జనసంద్రంగా మారుతాయి.
ముందస్తుగా మొక్కులు: 2024 జాతర సమయంలో గిరిజన దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం ఎంతో ఇబ్బంది అని భావించే భక్తులు ముందస్తుగానే అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర సమయంలో కనుచూపుమేర భక్తలు కనిపిస్తారు.. జంపన్నవాగు, కల్యాణ కట్ట, అమ్మవారి దర్శనానికి భారీ క్యూలైన్లు ఉంటాయి. మేడారంలో విడిది చేయడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ కారణంగా సుమారు రెండు నెలలు ముందుగానే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర సమయంలో గద్దల పైకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పాటు జనం కిక్కిరిసిన లైన్లలో గంటలు తరబడి నిలబడి నిరీక్షించాల్సి వస్తుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని భక్తులు ముందుగానే ఇక్కడికి చేరుకుంటున్నారు.
కరోనా భయం: 2024 సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి బుధవారం ప్రారంభమై నాలుగో రోజు శనివారం దాకా కొనసాగుతుంది. అమ్మవార్లకు బుధవారం, ఆదివారం పవిత్రరోజులుగా భావించే భక్తులు ముందస్తు మొక్కుల్లో భాగంగా ఆదివారం, బుధవారాల్లో భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం ఆది, సోమవారం నూతన సంవత్సరం రెండు రోజులు సెలవులు రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి వస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా మరోసారి ప్రతాపం చూపిస్తోంది. కొత్తవేరియంట్లు కలవరపెడుతున్నాయి ఈనేపథ్యంలో జాతర వేళ కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో చాలా మంది ముందుగానే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నామని మరికొందరు భక్తులు చెబుతున్నారు.