బెంగాల్‌, పుణెరి పోరు టై

బెంగాల్‌, పుణెరి పోరు టై– ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11
నవతెలంగాణ-హైదరాబాద్‌ : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో మరో మ్యాచ్‌ టైగా ముగిసింది. ఆఖరు కూత వరకు ఉత్కంఠరేపిన బెంగాల్‌ వారియర్స్‌, పుణెరి పల్టాన్‌ పోరు 32-32తో టై అయ్యింది. మాజీ చాంపియన్ల సమరంలో ప్రథమార్థం ఆటలో పుణెరి పల్టాన్‌ మూడు పాయింట్ల ఆధిక్యం సాధించినా.. ద్వితీయార్థంలో బెంగాల్‌ వారియర్స్‌ లెక్క సమం చేసింది. పీకెఎల్‌ సీజన్‌ 11లో ఇది మూడో టై కావటం విశేషం. బెంగాల్‌ వారియర్స్‌ ఆటగాళ్లలో రెయిడర్‌ సుశీల్‌ (10 పాయింట్లు) సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో మెరువగా..నితిన్‌ కుమార్‌ (6 పాయింట్లు), నితేశ్‌ కుమార్‌ (4 పాయింట్లు) రాణించారు. పుణెరి పల్టాన్‌ తరఫున ఆకాశ్‌ షిండె (8 పాయింట్లు), పంకజ్‌ మోహిత్‌ (8 పాయింట్లు) ఆకట్టుకున్నారు. ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు,ఓ టైతో పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్‌ అగ్రస్థానం నిలుపుకోగా.. బెంగాల్‌ వారియర్స్‌ నాలుగు మ్యాచుల్లో ఒక్క విజయమే సాధించింది.