వసతి గృహ విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి

Adilabad– ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా
నవతెలంగాణ-ఉట్నూర్‌
ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం లక్షెట్టిపేట, యెందా ఆశ్రమ బాలురను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల అటెండెన్స్‌, స్టాక్‌ రిజిస్టార్లను పరిశీలించారు. ఈ సందర్బంగా పీఓ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలన్నారు. నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు వంటగది, స్టోర్‌ రూమ్‌, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోదించారు. సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఏమైనా మరమ్మతులుంటే తన దృష్టికి తెవాలన్నారు. వర్షాల నేపథ్యంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా వసతి గృహ పరిసరాలలో వర్షపు నీరు నిలువకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.