న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీకి ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న అవార్డు లభించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉంది. ఆయనతో మాట్లాడి నేను అభినందనలు తెలిపా. అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఈ దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం’ అని మోడీ పేర్కొన్నారు. కరాచీలో 1927 నవంబర్ 8న అద్వానీ జన్మించారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం ముంబయికి వలస వచ్చింది. అద్వానీ 1941లో ఆర్ఎస్ఎస్లో చేరారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఫ్ులో 1951లో చేరారు. 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ చైర్మెన్గా ఎన్నికయ్యారు. 1970లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1989 వరకూ ఆయన నాలుగుసార్లు రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. జనసంఫ్ు 1977 ఎన్నికలకు ముందు జన సంఫ్ు జనతాపార్టీలో విలీనమైంది. 1977 సాధారణ ఎన్నికల్లో జనతా పార్టీ గెలవడంతో అద్వానీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించిన నలుగురిలో అద్వానీ ఒకరు. పార్టీకి ఆయన మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. అద్వానీ మొదటిసారిగా 1989లో లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏడుసార్లు లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. 1998నుంచి 2004వరకూ ఆయన సుదీర్ఘకాలం హోంమంత్రిగా పనిచేశారు. లోక్సభలోనూ చాలాకాలం ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2002నుంచి 2004వరకూ ఉపప్రధానిగా కొనసాగారు.
నిస్వార్థంగా పనిచేశాను : అద్వానీ
అద్వానీకి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అద్వానీ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ.. ‘నేను 14 ఏండ్ల వయసులోనే ఆరెస్సెస్లో వలంటీర్గా చేరాను. అప్పటినుంచి నాకప్పగించిన ఏ పనైనా అంకిత భావంతో చేశాను. దేశం కోసం నిస్వార్థంగా పనిచేశాను’ అన్నారు.