నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ ప్రజలు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ వెంకటరమణ మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకపోవడంతో అనేకమంది ద్విచక్రవాహనదారులు ప్రమాదాలు జరిగినప్పుడు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు హెల్మెట్ లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు.హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని, ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని అన్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటివరకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు తలపై హెల్మెట్ ఉన్నా లేకున్నా చూసి చూడనట్టుగా వ్యవహరించిన పోలీసులు ఇకపై కఠినంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అలాగే తనిఖీల సమయంలో హెల్మెట్ ధరించకుండా పట్టుబడిన ప్రతి వాహనదారుడికి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సంజీవ్ తో పాటు సిబ్బంది, వాహనాదారులు తదితరులు పాల్గొన్నారు.