మండలం లో బర్డ్ ఫ్లూ కలకలం

నవతెలంగాణ – భీంగల్ రూరల్ 
తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతుండటంతో నిర్వాహకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని భీంగల్  మండలం బాబా పూర్, భీంగల్, పల్లికొండ పౌల్ట్రీ ఫామ్‌లో గత రెండు రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.  అయితే సోమవారం, మంగళవారం రోజుల్లోనే దాదాపు 2 వేల కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందాయి. దీంతో యజమానికి రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లిందని, వారు భారీ ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నట్లు బాధను వ్యక్తం చేశారు. కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ కారణమవుతోందేమో అనే  అనుమానంతో అధికారులకు  సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు పౌల్ట్రీ ఫామ్‌ను సందర్శించి, మరణాలకు గల కారణాలను పరిశీలించారు. కోళ్ల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం ఈ ఘటనలపై అధికారులు వేగంగా స్పందిస్తూ అనుమానాస్పద కోళ్ల మరణాలకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రజలు కొన్ని రోజులు చికెన్ తినడానికి ఆసక్తి చూపకూడదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పౌల్ట్రీ రైతులు స్వరక్షణ చర్యలు చేపట్టాలని, కోళ్లకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని అధికారుల సూచనలు అందించారు.