ఇంఫాల్: మణిపూర్లో శని, ఆదివారాలను పనిదినాలుగా ప్రకటిస్తూ బిజెపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికే డిప్యూటీ సెక్రటరీ (జిఎడి) గురువారం ఈ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పోరేషన్లు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు, సొసైటీలతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. మణిపూర్లో మొత్తం 9 జిల్లాలు ఉండగా, వీటిలో ఐదు జిల్లాల్లో క్రైస్తవులు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 41.29 శాతం క్రైస్తవ జనాభా ఉంది. వీరంతా కుకీ కమ్యూనిటీకి చెందినవారు. శుక్రవారం గుడ్ఫ్రైడే కాగా, శని, ఆదివారాల్లో ఈస్టర్ డేను ఘనంగా జరుపుకుంటారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈస్టర్ డే అయిన ఆదివారంను కూడా పనిదినంగా ప్రకటించింది. సాధారణంగా ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు అయినప్పటికీ… సెలవును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.