– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టి.జ్యోతి
– సీతారాం ఏచూరి ఆశయ సాధనకు కృషి చేస్తాం
నవతెలంగాణ-నిర్మల్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వరసత్వాన్ని వక్రీకరించి, ప్రజల మధ్య చిలికలు తెస్తున్న బీజేపీ విధానాలను తిప్పి కొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టి.జ్యోతి అన్నారు. ఆదివారం టీఎన్జీఓ భవనంలో సీపీఐ(ఎం) జిల్లా విస్తృతస్థాయి సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముందుగా సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లలర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడినారని అన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఎర్ర జెండా చేతబట్టి ప్రజలు పోరాడినారని అన్నారు. పాలకుర్తి గ్రామంలో చుట్టుపక్కల ప్రజలను చైతన్యపరిచి నైజం అరాచకాలను, తిప్పుకొట్టడానికి ధైర్యంతో ముందుకెళ్లిన వీరనారి చిట్యాల ఐలమ్మ ధీరత్వము నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే నిజమైన వారసులన్నారు. మతోన్మాద బీజేపీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోరాటాన్ని హిందూ ముస్లిం పంచాయతీలాగా మారుస్తుందన్నారు. చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేయాలని మోడీ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.అడివయ్య మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ డిక్లరేషన్స్ అమలు గురించి, ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఆసరా పెన్షన్స్ పెంచుతాని హామీ ఇచ్చి 10నెలలు అయినా పెంచడం లేదన్నారు. రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్న వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. దళిత, గిరిజన మహిళలపై లైంగికదాడులు, వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన ఉందని అన్నారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో నిర్మల్ పట్టణంలో సీపీఐ(ఎం) జిల్లా 3వ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభ నిర్వహణ కోసం ప్రజలు, వ్యాపారస్థులు, పట్టణ ప్రముఖులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్, బొమ్మెన సురేష్, బి.సుజాత, జిల్లా కమిటీ సభ్యులు తొడసం శంభు, జిల్లా నాయకులు ఫసివుద్దీన్, ప్రసాద, లలిత, రాజమణి, శైలజ, నాయకులు పాల్గొన్నారు.