బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు

సతీష్‌ కౌశిక్‌ కన్నుమూత ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్‌ కౌశిక్‌ (66) కన్నుమూశారు. హోలీ వేడుకల కోసం ధిల్లీలో ఉన్న స్నేహితుడు జావేద్‌ అక్తర్‌ ఇంటికి వెళ్ళిన ఆయన గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంట్లో నలతగా అనిపించడంతో డ్రైవర్‌తో కలిసి కారులో ఆస్పత్రికి బయలుదేరారు. అయితే ఆయన మార్గం మధ్యలోనే గుండెపోటుతో మృతిచెందినట్లు సన్నిహితులు తెలిపారు. ‘రూప్‌కీ రాణీ చోరోస్‌ కా రాజా’, ‘ప్రేమ్‌’, ‘తేరే నామ్‌’, ‘షాదీ సే పెహ్లే’ వంటి చిత్రాలకు సతీష్‌ దర్శకత్వం వహించారు. ‘ఉత్సవ్‌’, ‘సాగర్‌’, ‘మిస్టర్‌ ఇండియా’, ‘రాజాజీ’, ‘బాఘీ 3’ వంటి తదితర ఎన్నో చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించి, నటుడిగానూ మెప్పించారు. సతీష్‌ కౌశిక్‌ అకాల మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.