– సెక్రెటేరియట్లో ఫైర్ సర్వీస్ డెమో
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. అనుకోకుండా జరిగే అగ్నిప్రమాదాల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మాక్డ్రిల్ నిర్వహించారు. ఫైర్ సేఫ్టీపై అక్కడి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) భద్రతా సిబ్బంది, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. గతంలో తెలంగాణ స్పెషల్ పోలీసుల రక్షణలో ఉన్న సచివాలయం భద్రతను ఇటీవల ఎస్పీఎఫ్కి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జీవీ ప్రసాద్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు జన్య, ఏ యాదయ్య తదితరులు అగ్నిమాపక ప్రాథమిక అవగాహన, ఫైర్ ఎక్స్ టింగ్విషర్లు, ఫిక్స్డ్ ఫైర్ ఇన్స్టాలేషన్లను ఎలా ఉపయోగించాలి అనే అంశాలను వివరించారు. ఫైర్ సేఫ్టీ నివారణతో సహా అగ్ని ప్రమాదం సంభవిం చినప్పుడు ప్రజలను తరలించే విధానాల గురించి అగ్నిమాపక అధికారులు ఎస్పీఎఫ్ సిబ్బందికి తెలియజేశారు. బ్రొంటో స్కై లిఫ్ట్ (బీఎస్ఎల్) ద్వారా టెర్రాస్ నుంచి ఎలా రక్షించాలి… శ్వాస వ్యాయామాలు, కృత్రిమ శ్వాసక్రియ వంటి పలు విషయాలను వివరిం చారు. ఈ కార్యక్రమంలో సచివాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.