
కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రేషన్ కార్డులను మంజూరు చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ ధర్మ బిక్షం భవనంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య చాలా పెద్ద సమస్యగా మారిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నుండి రేషన్ కార్డులు జారీ చేయకపోవడం వల్ల లక్షలాది మంది పెళ్లైన దంపతులకు ఏ ప్రభుత్వం పథకం అందక చాలా దయనీయమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారని అన్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు ఇస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారని అన్నారు. అయినా అర్హులకు నిరాశ మిగిలిందని అన్నారు. కొత్త రేషన్ కార్డులు మంజూరులో ప్రక్షాళన చేసి అర్హులకు అందేలా చేయాలని తెలిపారు. ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతున్న రేపు మాపని చెప్తుందే తప్ప ఇంతవరకు ముందుకు సాగలేదని అన్నారు. రేషన్ కార్డు జారీ చేయకుంటే దశలవారీగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు నిమ్మల ప్రభాకర్,కౌన్సిల్ సభ్యులు పెండ్ర కృష్ణ, కిట్టు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.