గాజాలో హమస్కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం గురించి బ్రెజిలియన్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యపై ఇజ్రాయిల్ తీవ్రంగా స్పందించింది. గాజాలో ఇజ్రాయిల్ చర్యలు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీలు లక్షలాది యూదులను కిరాతకంగా హతమార్చిన విషయాన్ని గుర్తుకు తెస్తున్నాయని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ప్రకటించటంతో ఆయనను ‘ఇజ్రాయిల్ ఆహ్వానించదగిన వ్యక్తి కాదు(పర్సొనా నాన్ గ్రాటా)అని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి బ్రెజిల్ రాయబారిని పిలిచి చెప్పటం జరిగింది. ఒక దేశ అధ్యక్షుడిని పర్సొనా నాన్ గ్రాటా గా ప్రకటించటం మూర్కత్వం అని లూలా ప్రధాన సలహాదారు సెల్సో అమోరిమ్ ప్రకటించాడు. గాజాలో హమస్ మిలిటెంట్లపై దాడి పేరుతో ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజలపై సాగిస్తున్న దాడులను ”మానవ హననం” అని, ఇది 80 ఏండ్ల క్రితం హిట్లర్ పాలనలో లక్షలాది యూదుల ఊచకోతను పోలివుందని గత వారాంతంలో లూలా వర్ణించాడు. పాలస్తీనాను ఒక రాజ్యంగా గుర్తించటానికి ఇజ్రాయిల్ నిరాకరిస్తోందని ఆదివారం నేతాన్యాహు ప్రకటించాడు.ఇజ్రాయిల్తో పాటుగా పాలస్తీనాను కూడా ఒక దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజం ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తోంది. ఇజ్రాయిల్ తనను పర్సొనా నాన్ గ్రాటా గా ప్రకటించిన తరువాత లూలా తమ రాయబారి మేయర్ ను చర్చల కోసం బ్రెజిల్ కు రమ్మని ఆదేశించాడు. లూలా తన మాటలకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించాడు. అంటే ఇజ్రాయిల్ లోని బ్రెజిల్ రాయబారి కార్యాలయం ఇకనుంచి ఒక చార్జ్ డి అప్పైర్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది. గాజాపైన ఇజ్రాయిల్ చేస్తున్న మారణహౌమంలో ఇప్పటికే 35000 పాలస్తీనా ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. వీరిలో అత్యధిక శాతం మహిళలు, పిల్లలు. గాజాను నేలమట్టం చేసిన ఇజ్రాయిల్ అక్కడ నివసిస్తున్న 20లక్షల పాలస్తీనా వాసులను ఈజిప్ట్ కు తరలించాలని అనేకమంది ఇజ్రాయిలీ ప్రభుత్వాధికారులు
ప్రయత్నిస్తున్నారు. జెనొసైడల్ కన్వెన్షన్ కింద దక్షిణ ఆఫ్రికా అంత ర్జాతీయ న్యాయస్థానంలో గాజాపైన ఇజ్రాయిల్చేస్తున్న మారణహౌమం గురించి వేసిన కేసులో కోర్టు అటువంటి చర్యలకు పాల్పడవద్దని ఇజ్రాయిల్ ను ఆదేశించింది.