మెరిసిన పూజ, స్నేహ్‌ రాణా

– ఆస్ట్రేలియాను కట్టడి చేసిన మహిళా బౌలర్లు
– ఆస్ట్రేలియా 219ఆలౌట్‌
– భారత్‌ 98/1
ముంబయి:
ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత మహిళలు సత్తా చాటారు. వాంఖడే వేదికగా గురువారం నుంచి ప్రారంభమైన టెస్ట్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను కేవలం 219పరుగులకే టీమిండియా బౌలర్లు ఆలౌట్‌ చేశారు. బౌలింగ్‌లో పూజ వస్త్రాకర్‌(4/53), స్నేహ్‌ రాణా(3/56), దీప్తి శర్మ(2/45) రాణించి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. ఇంగ్లండ్‌ను 347 పరుగులతో చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన ఆస్ట్రేలియాపైనే రాణించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆది నుంచి తడబడింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ ఫొబే లిచ్‌ఫీల్డ్‌(0) రనౌటయ్యింది. ఆ తర్వాతి ఓవర్లోనే డేంజరస్‌ ఎలిసా పెర్రీ(4)ని పూజా వస్త్రాకర్‌ వెనక్కి పంపింది. బేత్‌ మూనీని(40 ), సథర్‌లాండ్‌(16) ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు తీస్తూ కంగారూలను ఒత్తిడిలోకి నెట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ వికెట్‌ నష్టపోయి 98 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(40) ఔట్‌ కాగా.. స్మతి మంధానా(43), స్నేహ్‌ రాణా(4) క్రీజ్‌లో ఉన్నారు. మంధాన-షెఫాలీ కలిసి తొలి వికెట్‌కు 90పరుగులు జతచేశారు. భారతజట్టు ఇంకా 121పరుగులు వెనుకబడి ఉంది.