– కవితకు సీబీఐ నోటీసులపై జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ను ఓడించేందుకు మరో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. ఆమెను అరెస్టు చేస్తే సానూభూతి వస్తుందని భావిస్తున్నదని తెలిపారు. తర్వాత కాంగ్రెస్ ఓట్లు చీల్చాలనేది ఆ పార్టీ నేతల ఆలోచన అని అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అని చెప్పారు. రాహుల్గాంధీ ప్రధాని కావడం కోసం నిర్విరామంగా పనిచేస్తానన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ ప్రధానిగా కాకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు గెలవడమే తమ లక్ష్యంగా ముందుకు పోతామన్నారు. లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పుడు ఎంపీ బండి సంజరు..ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందని చెప్పారని ఏమైంది? అని ప్రశ్నించారు. ఇప్పుడు కవితకు నోటీసుల విషయం కూడా అంతా డ్రామానే అని ఎద్దేవా చేశారు.
వారు పోరాడుతుంటే.. కేసీఆర్ జాడ లేకుండా పోయారు
గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తనపై ఆయన తీవ్ర ఒత్తిడి చేశారని చెప్పారు. ఎన్నికల రోజు తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. తనను 12 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేశారని.. అయిన తన వర్గమే ఆ ఎన్నికల్లో గెలిచిందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. కేసీఆర్ను పక్కన పెట్టడం వల్లే.. అప్పటి టీఆర్ఎస్ పార్టీను పెట్టారని.. తెలంగాణ కోసం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ఎక్కడ లేరని చెప్పారు. పార్లమెంట్లో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కి, పెద్దపల్లి వివేక్ వెంకటస్వామి, సిరిసిల్ల రాజయ్య, మంద జగన్నాధం తెలంగాణ కోసం పోరాడారని గుర్తుచేశారు. మాజీ ఎంపీ అంజన్ కూమర్ యాదవ్, సురేష్ షెట్కార్లు పార్టీ లైన్లో పని చేశారని వివరించారు. ఢిల్లీ గెస్ట్ హౌస్లో టీవీ చూసుకుంటూ కేసీఆర్ ఉన్నాడని చెప్పారు. తెలంగాణ ప్రకటించిన అనంతరం కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి ఉద్యమాన్ని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పారు.10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని జగ్గారెడ్డి మండిపడ్డారు.