మార్కెట్‌ కమిటీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం ఆపాలి

– రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం హర్షనీయం
– ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సహకారంతోనే తాండూరు అభివృద్ధి
– మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న పరిమల్‌, పీఎసీఎస్‌ చైర్మెన్‌ రవిగౌడ్‌
నవతెలంగాణ-తాండూరు
రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం హర్షనీయమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న పరిమల్‌, పీఎసీఎస్‌ చైర్మెన్‌ రవిగౌడ్‌ అన్నారు. తాండూరు నియోజకవర్గంలో సీఎం రేవంత్‌ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాండూరులో మార్కెట్‌ కమిటీ రిజర్వేషన్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చిగానే కనిపిస్తుందన్నట్టుగా ఈ బీఆర్‌ఎస్‌ నాయకుల తీరు అలాగే ఉందన్నారు. ఎమ్మెల్మే నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా బ్రహ్మాండమైన పాలన సాగుతూ ఉంటే చూసి ఓర్వలేకనే ఆయా పార్టీలు మార్కెట్‌ కమిటీపై తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. తాండూర్‌ మార్కెట్‌ కమిటీ రిజర్వేషన్‌ ఏది ఉందో తెలుకోలేనంతగా మేము లేమని అనుకోవడం మీ సిగ్గుచేటు అని విమర్శించారు. కాంగ్రెస్‌ సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన పార్టీలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి అపారమైన అనుభవం ఉందనీ, ఎవ్వరికి ఎప్పుడూ ఏ పదవి ఇవ్వాలో బాగా తెలిసిన వ్యక్తి అని వెల్లడించారు. మార్కెట్‌ కమిటీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచార చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్న నాయకులు తెలుసుకోవాలన్నారు. బీసీ-బి నుంచి బీ-డి కి మారిన విషయం తెలుసుకోలేక పోవడం తెలివి తక్కువ తనానికి నిదర్శమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. గతంలో లక్షరూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వతమే చేసిందని ప్రస్తుతం 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు విజయదేవి రంగారావు, ప్రభాకర్‌ గౌడ్‌, ప్రవీన్‌ గౌడ్‌, మాజీ కౌన్సిలర్‌ జుబేర్‌ లాల, నాయకులు సురేందర్‌ రెడ్డి, హబీబ్‌ లాల, నర్సిరెడ్డి, నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.