– కామారెడ్డి జిల్లాలో ఘటన
నవతెలంగాణ-నసురుల్లాబాద్(బీర్కూర్)
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో దంపతులు దారుణహత్యకు గురైన ఘటన సంచలనం రేపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన దారం నారాయణ గుప్తా (75) 40 ఏండ్ల కిందట రైతునగర్ గ్రామానికి చెందిన సుశీల(65) ను వివాహం చేసుకొని ఇంట్లోనే కిరాణా దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేదు. వ్యాపారం ద్వారా దాచుకున్న కొంత డబ్బును ఇతరులకు అప్పుగా ఇస్తుంటారు. కాగా బుధవారం తెల్లవారుజామున ఇంటి వెనుక నుంచి నిచ్చెన వేసుకొని ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. ఇతరులకు అరుపులు, కేకలు బయటకు వినపడకుండా టీవీ శబ్దం ఎక్కువ చేసి.. నారాయణ గుప్తాను మరణాయుధంతో తలపై బాది హత్య చేశారు. అనంతరం సుశీలను హాలులోకి తీసుకెళ్లి చీరతో ఉరేశారు. ఉదయమైనా నారాయణగుప్త ఇంటి తలుపులు మూసి ఉండటంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాన్సువాడ రూరల్ సీఐ మురళి, బాన్సువాడ డీఎస్పీ రఘునాథరెడ్డి రైతునగర్లోని ఘటనాస్థలికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకొని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను రప్పించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన భార్యభర్తలు ఇద్దరు కూడా ఎవరినీ పల్లెత్తు మాట అనేవారు కాదని గ్రామస్తులు తెలిపారు. కాగా పోలీసులు హత్యకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో భార్యభర్తల దారుణ హత్య జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.