– ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్తో 40 శాతం పెరిగిన ప్రయాణికులు
– రోజువారీ సగటు సంఖ్య 28 లక్షల నుంచి 43 లక్షలకు పెంపు
– పాత బస్సులు కావటంతో.. అదుపు తప్పే ప్రమాదం ఉందనే ఆందోళన
నవతెలంగాణ – బోనకల్
మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులపై పెద్ద ప్రభావమే చూపుతోంది. నిత్యం 13 లక్షల మేర ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అదనంగా ప్రయాణిసున్న వారిలో 90 శాతం మంది మహిళలే అన్నది సుస్పష్టం. ఈ రూపంలో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు రూ.4.50 కోట్లు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో (ఆర్డినరీ, ఎక్స్ప్రెస్) ఉచితంగా ప్రయాణిస్తున్నందున టికెట్ రూపంలో నేరుగా ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుంది తప్ప పెరగదు. కాని ఈ పథకంతో ఆర్టీసీ కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్ రూపంలో ఆదాయం సమకూరుతుంది. గతంలో సాధారణ రోజుల్లో ఆర్టీసీకి నిత్యం రూ.13-14 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, ఇప్పుడది రూ.18.25 కోట్లకు చేరుతోంది. గతంలో సాధారణ రోజుల్లో (సోమవారం కాకుండా) నిత్యం బస్సుల్లో 25-30 లక్షల మధ్య ప్రయాణించేవారు. ఇప్పుడది 43 లక్షలు దాటుతోంది. వెరసి ఈ పథకం ప్రారంభమయ్యాక 40 శాతం ప్రయాణికులు పెరిగనట్టు ఆర్టీసీ అధికారులు గుర్తించారు. ఖమ్మం జిల్లాలో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టకముందు కనీసం 30 నుంచి 40 శాతం మహిళలు కూడా బస్సుల్లో ఎక్కేవారు కాదు. కానీ ప్రస్తుతం 80శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వెళుతున్నారు. బోనకల్ నుంచి ఖమ్మం వెళ్లే రూట్లో పల్లె వెలుగు బస్సులే ఎక్కువగా ఉన్నాయి. ఈ రూట్లోనే ఆర్టీసీకి అత్యధిక ఆదాయం వస్తుంది. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో ఆదాయం మూడు రెట్ల వరకు పెరిగినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్ప్రెస్ సర్వీసులు కొన్ని మాత్రమే ఉన్నాయి.
జీరో టికెట్ జారీతో తేలిన లెక్క…
సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రద్దీ అధికంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తే, సోమవారాల్లో ఆ సంఖ్య 34 లక్షల వరకు ఉంటుంది. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభమయ్యాక, గత సోమవారం 51 లక్షల మంది ప్రయాణించినట్టు ఆర్టీసీ అధికారులు లెక్కలేశారు. అయితే, ఆరోజు వరకు మహిళలకు టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. టికెట్లు జారీ చేస్తే ఎంతమంది మహిళలు బస్సులు ఎక్కారనేది ఖచ్చితంగా తెలుస్తుంది. మూడు రోజుల క్రితం జీరో టికెట్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారో ఆ టికెట్ల జారీతో తేలుతుంది. దానికి ఎంత చార్జీ చెల్లించాల్సి ఉంటుందో కూడా అందులో స్పష్టమవుతుంది. ఆర్టీసీ ఆ లెక్కలను ప్రతినెలా ప్రభుత్వానికి అందిస్తుంది. దాని ఆధారంగానే ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఇప్పుడు జీరో టికెట్ల జారీ ప్రకారం 16న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 43,12,033 మంది ప్రయాణించినట్టు తేలింది. వీరి ద్వారా రూ.1,826.49 కోట్ల ఆదాయం సమకూరింది. (ప్రభుత్వం రీయింబర్స్ చేసే మొత్తంతో కలిపి)
నాలుగు వేల బస్సులు పాతవే..
మహిళల సంఖ్య భారీగా పెరిగినందున బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. చాలా బస్సుల్లో మూడొంతుల స్థలంలో మహిళలే ఉంటున్నారు. దాంతో పురుషులు కొందరు స్థలం లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి అదుపు తప్పకుండా ఉండాలంటే కనీసం 2,500 కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేశారు. ప్రస్తుతం 40 శాతం రద్దీ పెరిగినా, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న బస్సులతోనే నెట్టుకొస్తున్నారు. అయితే, ఆర్టీసీలో దాదాపు 4 వేల బస్సులు బాగా పాతబడి ఉన్నాయి. ఈ బస్సుల్లో రద్దీ పెరిగితే అదుపుతప్పే ప్రమాదం ఉంటుంది. ప్రమాదాలు చోటుచేసుకునే వరకు ఎదురుచూడకుండా కొత్త బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. గతంలో ఆర్డర్ ఇచ్చిన బస్సులు కొన్ని త్వరలో సమకూరే అవకాశం ఉంది. కానీ అవి సరిపోవని, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని కొత్త బస్సులు కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించింది.