మల్హర్ లో జోరుగా గిరిగిరి వ్యాపారం

– తుంగలో తొక్కుతున్న నిబంధనలు
– అనుమతులు లేకుండానే వడ్డీ వ్యాపారం
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో చాలా కాలంగా అధిక వడ్డీ వ్యాపారం,గిరిగిరి దందా జోరుగా సాగుతోంది. రాను రాను వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితి మీరిపోతున్నాయి. గోరంత అప్పు ఇచ్చి కొండంత వడ్డీ వసూలు చేస్తున్నారు. ఎదుటివారి అవసరాలు, కష్టాలు ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు పడగ విప్పుతున్నారు. మండలంలోని తాడిచెర్ల, కొయ్యుర్,మల్లారం  గ్రామాల్లో వడ్డీ వ్యాపారం వల్ల గతంలో ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి. వీరి వడ్డీ మాత్రం మారడం లేదు. అధిక వడ్డీ వసూలు చేస్తూ బాధితులకు నరకయాతన చూపిస్తున్నారు.5 నుంచి 10 వరకు వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. అధిక వడ్డీ కట్టలేక అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి. సులభ వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చు అంటూ ఆశ చూపుతూ అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇందులో గిరి గిరి దందా నడిపే వారే అధికంగా ఉన్నారు. వీరిని ఎక్కువగా చిరు వ్యాపారులు ఆశ్రయిస్తున్నారు.రూ. 10 వేలు అప్పుగా కావాలనుకున్న వారికి వెయ్యి కోత విధించి తొమ్మిది వేలు ఇస్తున్నారు. వీరి నుంచి రోజుకు వంద చొప్పున 90 రోజుల్లో రూ. 10 వేలు వసూలు చేస్తున్నారు. మరికొంతమంది వంద రూపాయలకు ఐదు నుంచి 10 చొప్పున వడ్డీ వసూళ్లకు పాల్పడుతున్నారు. వారానికి కొంత చెల్లిస్తే సరిపోతుంది అంటూ మూడు నెలల కాలపరిమితి విధిస్తున్నారు. కానీ చివరికి మొత్తం చెల్లించేటప్పటికీ తీసుకున్న దాని కంటే మూడింతలు ఎక్కువగా చెల్లించవలసిన పరిస్థితి ఎదురవుతున్నది. ఎందుకు ఇంత వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఇది వడ్డీ వ్యాపారం ఇలానే ఉంటుందని బెదిరిస్తున్నట్లుగా సమాచారం. ఒకవేళ చెల్లించకపోతే మీరు ఇచ్చిన ప్రాంసరీ నోటు, మీరు సంతకం చేసిన చెక్ మా వద్ద ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది.
దర్జాగా వడ్డీదందా..
తాడిచెర్ల, కొయ్యుర్ గ్రామాల్లో ఎక్కువగా దర్జాగా వడ్డి దందా నిర్వహిస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారులు తమ దందాను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తున్నారు. అత్యధికులు అనుమతి లేకుండానే ఈ దందా సాగిస్తున్నారు. మనీ లెండింగ్ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. వీక్లీ ఫైనాన్స్ అంటూ గ్రామాల్లో కూడా వడ్డీ వ్యాపారం విస్తరించింది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వడ్డీ వ్యాపారులు కూడా కాటారం,మల్హర్  చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం కొనసాగిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల బాధితులలో అత్యధికంగా రైతులు, చిరు వ్యాపారులే ఉంటున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..
వడ్డీ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు విధించింది. వడ్డీ తీసుకునే ప్రజలపై భారం పడకుండా ఇబ్బందులు కలగకుండా చట్టాలను రూపొందించింది. దీనికోసం మనీ లెండింగ్ యాక్ట్ ను అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతి తీసుకుంటేనే వడ్డీ వ్యాపారం చేయవచ్చు. దీనికోసం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ఫారాలు పూరించి పేరు నమోదు చేయించుకోవాలి. వడ్డీ ఏడాదికి నిర్ణిత శాతం లోపు మాత్రమే తీసుకోవాలి. ఎన్ని నెలలు వడ్డీ ఇస్తారు దాన్ని మినహాయించుకోవాలి. ఏటా లెక్కల అధికారులు వీరి లావాదేవీలను పరిశీలించాలి. దీనికి తోడు ఈ వ్యాపారానికి ఆదాయ పన్ను చెల్లించాలి. ఎక్కడా కూడా వ్యాపారులు ఈ అనుమతులు తీసుకోవడం లేదు.
కుదువలో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులు..
కొందరు వడ్డీ వ్యాపారుల్లో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులు, బంగారు ఆభరణాలు, పట్టాదారు పాసు పుస్తకాలు, ఇల్లు, ఖాళీ స్థలాలు, వాహనాలు కుదపెట్టుకొని ఇచ్చే దళారులే అత్యధికంగా ఉన్నారు. తమ వద్దకు వచ్చే చిరు వ్యాపారులు రైతులకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు. ఈ వ్యాపారులు 25 నుంచి 30% వడ్డీ వసూలు చేస్తూ చిరు వ్యాపారుల రైతుల రక్తం పిండుతున్నారు. కొంతమంది దళారులు ఎలాంటి అనుమతులు లేకుండా చిరు వ్యాపారులకు, రైతులకు అప్పులు ఇస్తు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
వడ్డీ వ్యాపారం పేదోడిపై భారం..
అప్పు తీసుకున్న వారు సకాలంలో సకాలంలో చెల్లింపులు చేయకపోతే బెదిరింపులకు వేధింపులకు గురి చేస్తున్నారు. వ్యాపారం చేసుకునే చోట అవమానించడం జరుగుతున్నది. డబ్బులు చెల్లించకపోతే బజారుకీరుస్తామని పరువుకు భంగం వాటిల్లెలా ప్రవర్తించడం వంటివి చేస్తున్నారు. వీరి ఆగడాలు తాళలేక ఇల్లు వదిలి వెళుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తీసుకున్న అప్పుకు అధిక వడ్డీలు చెల్లించలేకపోతున్నారు. దీంతో వడ్డీ వ్యాపారులు కూలీలపై భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నారని తెలియ వచ్చింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పుకుంటే తమ పరువు పోతుంది అన్న ఉద్దేశంతో ఎంత వడ్డీ అయినా చెల్లించక తప్పడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. మండల కేంద్రంలో రోజుకు చొప్పున వారానికి ఏడు రోజులు వీరి వ్యాపారం మూడు అప్పులు,ఆరు వడ్డీలుగా కొనసాగుతోంది మండల కేంద్రంలో జరుగుతున్న ఈ దందా గురించి అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారుల నుంచి కాపాడాలని అప్పుబాధితులు కోరుకుంటున్నారు.