రాష్ట్రంలో బీసీ గణన చేయండి

Calculate BC in the state– సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టండి
– సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీసీ జనగణనతోనే బీసీ వర్గాలకు సమన్యాయం జరుగుతుందనీ, ఆ దిశలో బీసీ కుల గణన చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. న్యాయంగా తమకు దక్కాల్సిన వాటా కోసం ఆయా సామాజికవర్గాలు చేస్తున్న బీసీ జనగణన డిమాండ్‌కు కాంగ్రెస్‌ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ విషయంలో బీసీ సంఘాలు చేపట్టిన ప్రతి నిరసన ఉద్యమానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలిచిందని తెలిపారు. ఈమేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదించిన సమయంలో కూడా రాహుల్‌ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఇండియా కూటమిలోని భాగస్వాములైన జేడీయూ,ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలతో కూడిన నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం బీహార్‌ రాష్ట్రంలో బీసీ జనగణనను విజయవంతంగా చేపట్టిందని గుర్తు చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దేశ ప్రజలందరికీ అందిస్తామనే ఆశయాన్ని రాజ్యాంగం ప్రకటించిందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా…జనాభాలో సగ భాగమైన బీసీల పరిస్థితిలో ఏ మార్పు లేదని పేర్కొన్నారు. ఎవరి కుల దామాషా ప్రకారం వారు హక్కులు పొందటమే ప్రజాస్వామిక సామాజిక న్యాయం అని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆలోచన అని పేర్కొన్నారు. అరుదైన పక్షి, జంతు జాతులను రక్షించేందుకు ప్రభుత్వాలు వాటి లెక్కలు తీస్తున్నాయని తెలిపారు. కానీ, దేశ జనాభాలో సగం కన్నా ఎక్కువ ఉన్న బీసీల జనాభా ఎంతో తెలియదనీ, దేశంలో బీసీల జనాభా ఎంత ఉన్నదని తెలుసుకునేందుకు నేటికీ, బ్రిటీష్‌ పాలకులు చేపట్టిన జనాభా లెక్కలే ప్రామాణికంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా సామాజికంగా, ఆర్థికంగా, వెనుకబడిన బీసీ వర్గాలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీ కుల గణనతోనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందని వివరించారు. బీసీ కుల గణనతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15, 16 ప్రకారం విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్లు మరింత కట్టుదిట్టంగా అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.ఆయా సామాజిక వర్గాలకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుందని సూచించారు. జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం సాధ్యమవుతుందనీ, ఇప్పటి వరకు రిజర్వేషన్‌ ఫలాలు అందుకోలేని ఎన్నో వందల కులాలను వెలుగులోకి తీసుకురావచ్చనని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీ జనగణన డిమాండ్‌ను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ల ఆర్థిక స్థితి గతులేమిటి? వారి చదువులు ఎలా వున్నాయి? వారి ఉద్యోగ అవకాశాలేమిటి? దారిద్య్ర రేఖకు దిగువన ఉండటానికి కారణాలేంటి? బీసీల్లో ఇంకా సంచారజాతులుగా వున్న వారి దీనస్థితికి విముక్తి ఎప్పుడు? ఈ సమాచారం లేకుండా దేశాభివృద్ధికి వ్యూహాలు రచించడం కష్టమని తెలిపారు. బీసీలకు ఎంతో చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప చేసింది శూన్యమని పేర్కొన్నారు.
బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తెస్తామన్న మాట ఉత్తముచ్చటగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోనే కాకుండా కేవలం 20 సీట్లు మాత్రమే ఇచ్చి రాజకీయంగా కూడా బీసీలను అణగదొక్కాలనే కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా వారికి న్యాయంగా దక్కాల్సిన వాటా కావాలంటే, బీసీ జనగణనతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాబట్టి బీహార్‌ మాదిరిగా మీ ప్రభుత్వం కూడా తక్షణమే బీసీ జనగణన చేపట్టాలని కోరారు. 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కుతుందని రేవంత్‌ ఈ సందర్భంగా సీఎంను కోరారు.