గ్రూప్‌4 పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరవ్వాలి..

– పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణ
నవతెలంగాణ – పెద్దపల్లి
జూలై 1న ఉదయం 10గంటల నుండి 12-30 గంటల వరకు, మధ్యాహ్నం 2-30నుంచి 5 గంటల వరకు నిర్వహించు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో, ముందస్తుగా పరీక్షా సెంటర్లకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8గంటల నుండి 9-45 వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2-15 గంటల వరకు పరీక్షా సెంటర్‌ లోనికి అనుమతి ఉంటుందని, సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షా సమయానికి ముందస్తుగా వచ్చి ప్రశాంతంగా పరీక్ష రాయాలని, అభ్యర్థులు తమ వెంట ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకొని రావద్దని, ఒరిజినల్‌ హాల్‌ టికెట్‌తోపాటు ఒరిజినల్‌ వ్యాలిడిటి ఫోటో ఐడి. గుర్తింపు కార్డ్‌ తీసుకొని రావాలని సూచించారు. జిల్లాలో 43పరీక్షా కేంద్రాలలో 17వేల 927మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థులు ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సెల్‌ ఫోన్‌లు వెంట తీసుకొని రావద్దని అభ్యర్థులకు తెలిపారు. అభ్యర్థులు హల్‌ టికెట్‌పై ఫోటో, సంతకం చెక్‌ చేసుకోవాలని, హాల్‌ టికెట్‌పై ఫోటో సరిగ్గా లేని పక్షంలో గెజిటెడ్‌ అధికారి ధృవీకరించిన 3పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫోటో తీసుకొని రావాలని లేనిపక్షంలో పరీక్షకు హజరు కాలేరని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. అభ్యర్థులు ఓఎంఆర్‌ షిట్‌పై సూచనలు చదవాలని, హాల్‌ టికెట్‌ నెంబర్‌, ప్రశ్నా పత్రం నెంబర్‌ సరిగ్గా నమోదు చేయాలని, ప్రశ్న పత్రంలో 150ప్రశ్నలను సరి చూసుకోవాలని, 150 ప్రశ్నలు లేకపోతే వెంటనే ఇన్విజిలేటర్‌కు సమాచారం అందించాలని కలెక్టర్‌ తెలిపారు. ఓఎంఆర్‌ షిట్‌పై వైటనర్‌, ఎరెజర్‌, వివిధ రకాల ట్యాంపరింగ్‌ పాల్పడితే ఆ ఓఎంఆర్‌ షీట్‌ చెల్లదని, పరీక్షా కేంద్రాల్లో ఇతరులతో మాట్లాడటం, ఇతరులను డిస్ట్రబ్‌ చేయకూడదని, పరీక్ష ముగిసిన తరువాత అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌ అప్పజెప్పిన తర్వాత ఎడమచేతి బొటనవేలు థంబ్‌ ఇంప్రెషన్‌ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.