కెప్టెన్‌ మిల్లర్‌ 25న తెలుగులో రిలీజ్‌

ధనుష్‌ నటించిన మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈనెల 25న తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈనెల 12న సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ రిపోర్ట్స్‌ అందుకుంది. ఇదిలా ఉంటే, లేటెస్ట్‌గా హీరోలు నాగార్జున, వెంకటేష్‌ తమ సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో ఈ చిత్ర తెలుగు థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ధనుష్‌ను టైటిల్‌ రోల్‌లో కెప్టెన్‌ మిల్లర్‌గా పరిచయం చేస్తూ, బ్రిటిష్‌ పాలనలో భారతదేశంలోని స్వాతంత్య్రానికి ముందు కాలంలోకి మనల్ని తీసుకువెళుతుందీ ట్రైలర్‌. ధనుష్‌ తన గ్రామాన్ని దోచుకోవడానికి ప్రయత్నించే వలసవాదులను ఎదుర్కొంటూ స్థానిక తిరుగుబాటు నాయకుడిగా కనిపించారు. అతన్ని బ్రిటీష్‌ వారు డెకాయిట్‌ అని, స్థానికులు దేశద్రోహి అని పిలుస్తారు. ధనుష్‌ యాక్షన్స్‌ ఇతరుల ప్రవర్తనపై ఆధారపడి ఉందని ట్రైలర్‌ ద్వారా స్పష్టమైంది. ధనుష్‌ డిఫరెంట్‌ అవతార్స్‌లో కనిపించారు. అద్భుతమైన నటనను కనపరిచి సినిమాను తన భుజాలపై నడిపారు. ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటించగా, సందీప్‌ కిషన్‌, శివ రాజ్‌ కుమార్‌ కూడా ట్రైలర్‌లో ఆకట్టుకున్నారు. అరుణ్‌ మాథేశ్వరన్‌ కథను ఆసక్తికరంగా మలిచారు. ధనుష్‌ని మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌, యాక్షన్‌ అవతార్‌లో చూపించారు. సిద్ధార్థ నుని కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. జివి ప్రకాష్‌ కుమార్‌ తన అద్భుతమైన స్కోర్‌తో విజువల్స్‌ను ఎలివేట్‌ చేశారు. ఈ భారీ బడ్జెట్‌ ఎంటర్‌టైనర్‌ను టి.జి. త్యాగరాజన్‌ సత్యజ్యోతి ఫిల్మ్స్‌, సెంధిల్‌ త్యాగరాజన్‌,అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మించారు. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఈ చిత్రాన్ని జి. శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి ట్రైలర్‌ అంచనాలు మరింతగా పెంచింది. ఈ చిత్రానికి టి రామలింగం ప్రొడక్షన్‌ డిజైనర్‌. బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్‌ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్‌ రాశారు.