
– అవసరం లేకున్నా కేసులను రెఫర్ చేస్తే కఠిన చర్యలు
– కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు, మున్సిపల్, పంచాయతీ అధికారులు రానున్న మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వైద్యాధికారులు, ప్త్యేక అధికారులు, తదితరులతో సీజనల్ వ్యాధులు, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.జ్వరాల పై ఆయన మాట్లాడుతూ ఏ గ్రామం, ఏ ప్రాంతం నుండి ఎక్కువగా జ్వరాలు వస్తున్న వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. ఆశ, అంగన్వాడి తో పాటు, ఏఎన్ఎంలు వారికి కేటాయించిన విధుల సమయంలో గ్రామంలోనే ఉండాలని, ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జ్వరాలకు సంబంధించి రిజిస్టర్ ను నిర్వహించాలని, జ్వరాలు ఎక్కువగా వచ్చే గ్రామాలు, పట్టణాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని, వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆయా ప్రాథమిక వైద్య ఆరోగ్య సెంటర్ల లోని పనిచేసే శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, డాక్టర్లు రోగులతో దురుసుగా ప్రవర్తించవద్దని ,ఎవరైనా అలా ప్రవర్తించినట్లు జిల్లా కలెక్టర్ కార్యాయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు ఫిర్యాదు అందినట్లయితే ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 18004251442 నంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా కొన్ని ఆస్పత్రుల నుండి లేదా నేరుగా జిల్లా కేంద్ర ఆస్పత్రికి, కేసులను రిఫర్ చేస్తున్నారని, అవసరం ఉన్న కేసులు మాత్రమే రిఫర్ చేయాలని, ప్రత్యేకించి ఆశ వర్కర్లు ఎట్టి పరిస్థితులలో నేరుగా జిజిహెచ్ కు కేసులు రిఫర్ చేయకూడదని ఆదేశించారు. అనవసరంగా రిఫర్ చేసినట్లయితే వారి జీతం నిలిపివేయడం జరుగుతుందని హెచ్చరించారు. వైద్యాధికారులు వారి ప్రాంతాలలో అవసరమైతే మరోసారి జ్వర సర్వే నిర్వహించాలని,వచ్చే డిసెంబర్ వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు. వైద్య ఆరోగ్యశాఖ తో పాటు, స్థానిక సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఎవరు అనధికారికంగా గైర్హాజరు కావద్దని, విధులలో ఉన్న సమయంలో కష్టపడి పని చేయాలని సూచించారు. రిఫర్ చేసే కేసులకు సంబంధించి తక్షణమే ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేస్తున్నామని, 15 రోజులకు ఒకసారి రిఫరల్ కేసులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృనాయక్, ప్రభుత్వ వైద్య కళాశాల హెచ్ఓడి స్వరూప, ప్రత్యేక అధికారులు, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరిoఇంటింటెంట్ డాక్టర్ రమణమూర్తి, ప్రాథమిక వైద్యా ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, ఏరియా ఆసుపత్రి డాక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.