ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని జేపీ నడ్డా, అమిత్‌ మాలవియా, విజయేంద్రపై కేసు

బెంగళూరు: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, పార్టీ ఐటి సెల్‌ అధ్యక్షులు అమిత్‌ మాలవియా, పార్టీ కర్నాటక అధ్యక్షులు బివై విజయేంద్రపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఒక సోషల్‌ మీడియా పోస్టులో ఒక అభ్యర్థికి ఓటు వేయవద్దని ఎస్‌సీ, ఎస్‌టీ ప్రజలను బిజెపి నాయకులు బెదిరింపులకు గురి చేశారని కేపీసీసీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఐపిసిలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 505 (2) ప్రకారం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కర్నాటక బీజేపీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసిన వీడియోను కూడా ఫిర్యాదులో కాంగ్రెస్‌ జత చేసింది. బీజేపీ పోస్టు చేసిన వీడియో ఉద్దేశపూర్వకంగా అల్లర్లను రెచ్చగొట్టడం, వివిధ మతాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, ఒక నిర్దిష్ట అభ్యర్థికి ఓటు వేయవద్దని ఎస్‌సి, ఎస్‌టిలను బెదిరించడం, ప్రజల మధ్య సామరస్యాన్ని విఘాతం కలిగించేదిగా ఉందని కాంగ్రెస్‌ తన ఫిర్యాదులో పేర్కొంది.