నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2017లో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ సచివాలయం ముట్టడి సందర్భంగా పలువురు నాయకులపై నమోదైన అక్రమ కేసులను నాంపల్లి కోర్టు సోమవారం కొట్టేసింది. వారిలో కోట రమేష్, మరికంటి నాగేశ్వరరావు, నరేష్, ప్రకాశ్కరత్ తదితరులున్నారు. నాంపల్లి కోర్టులో పలు వాయిదాల తర్వాత ఆ కేసును కొట్టేశారు. వారి తరఫున న్యాయవాది సావుకారు శ్రీనివాస్ కోర్టులో వాదించారు.
కోర్టుల చుట్టూ తిప్పడం పాలకుల కుట్ర : కోట రమేష్
రోజువారీ ఉద్యమాలకు సంబంధించిన కేసులు, సాధారణ కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పడం పాలకుల కుట్ర అని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ తెలిపారు. ఏడేండ్ల కింద నమోదైన అక్రమ కేసును సోమవారం కొట్టేశారని వివరించారు. పాలకులకు కేసులు నమోదు చేయడంపై ఉండే శ్రద్ధ సమస్యలను పరిష్కరించడంలో ఉండాలని సూచించారు.