అధికారంలోకి రాగానే కుల గణన

అధికారంలోకి రాగానే కుల గణన– అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేస్తాం : ఎస్పీ చీఫ్‌
లక్నో : రానున్న లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆ పార్టీ చీఫ్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ బుధవారం విడుదల చేశారు. 2025 నాటికి కుల గణన చేపడతామని, అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అఖిలేశ్‌ యాదవ్‌ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం కుల గణన చేపడతామని చెప్పారు.
2025 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేసి సాయుధ దళాలకు రెగ్యులర్‌ రిటైర్మెంట్‌ను వర్తింపచేస్తామని అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు.
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, మీడియా స్వేచ్ఛా హక్కు, సామాజిక న్యాయ హక్కు దేశ అభివద్ధికి కీలకమని విజన్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచామని అఖిలేశ్‌ తెలిపారు. కుల గణన లేకుండా సమ్మిళిత వృద్ధి సాధ్యం కాదని, దేశ అభివృద్ధికి కుల గణన దిక్సూచీ వంటిదని ఆయన పేర్కొన్నారు.