– కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు నగదుతో పాటు తులం బంగారం
– నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్
– గురుకుల భవనాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు
– గ్రీన్ ఛానల్ ద్వారా డైట్, కాస్మోటిక్ చార్జీల చెల్లింపు : బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”రాష్ట్రంలో త్వరలోనే కుల గణన చేపడతాం. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకిచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ను రూపొందిస్తున్నాం” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలల పూర్తి వివరాలను అందించాలని సూచించారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ఎంత ఖర్చవుతుందో విడివిడిగా ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని అన్నారు. మహాత్మ జ్యోతిభాపూలే ఓవర్ సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ను మరింత సమర్ధంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. అత్యున్నత విదేశీ యూనివర్సిటీలను గుర్తించి వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. దీంతో పాఠశాలల నిర్వహణ, పర్యవేక్షణ, మరింత మెరుగవుతుందని అన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవటం ద్వారా వారిలో ప్రతిభా పాఠవాలతో పాటు, పోటీ తత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలనీ, వీలు కాకుంటే ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్లో మరో పట్టణం లేదా మండల కేంద్రాలను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే 20 ఎకరాలకుపైగా విస్తీర్ణమున్న ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్ గా తీర్చిదిద్దే అవకాశాలుంటే పరిశీలించాలని ఆదేశించారు. వీటి నిర్మాణం, నిర్వహణకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద నిధులు సమీకరించాలని సూచించారు.
బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్ గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు