ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ చార్జిషీట్‌పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై విచారణ వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణను సెప్టెంబర్‌ 11 తేదీకి వాయిదా వేసినట్లు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ ట్రయిల్‌ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా బుధవారం తెలిపారు. బుధవారం ట్రయల్‌ కోర్టు చేపట్టిన విచారణకు ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో కొన్ని డాక్యుమెంట్స్‌ సరిగా లేవని, కోర్టు రికార్డుల నుంచి బెస్ట్‌ క్వాలిటీతో ఉన్న పత్రాలను ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. సెప్టెంబర్‌ 4 లోపు నిందితుల తరపున న్యాయవాదులు అడుగుతున్న డాక్యుమెంట్లను అందజేయాలని న్యాయమూర్తి కావేరి భవేజా సీబీఐని ఆదేశించారు. అనంతరం విచారణను సెప్టెంబర్‌ 11కి వాయిదా వేశారు.